అగర్తలా: త్రిపురకు చెందిన బీజేపీ మంత్రి కొత్త వివాదాన్ని రేకెత్తించారు. మాజీ సీఎం బిప్లబ్ దేబ్ను స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ వంటి గొప్ప వ్యక్తులతో పోల్చారు. ధలై జిల్లాలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రతన్ లాల్ నాథ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం బిప్లబ్ దేబ్ను పొగడ్తలతో ముంచెత్తారు. గత ప్రభుత్వాలలో ఉన్నవారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన మాదిరిగా పెద్దగా కలలు కనలేదని అన్నారు. ఆ కలలలో కొన్నింటిని ఆయన నెరవేర్చారని కొనియాడారు. ‘గతంలో మన దేశంలో, ప్రపంచంలో సుభాష్ చంద్రబోస్, రవీంద్ర నాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, వివేకానంద, ఐన్స్టీన్ వంటి గొప్ప వ్యక్తులు జన్మించిన సందర్భాలున్నాయి. మన రాష్ట్రంలో అలాంటి వ్యక్తి బిప్లబ్ కుమార్ దేబ్. ఆయన కొత్త దిశను అందించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారు. బిప్లబ్ దేబ్ త్రిపురలో పుట్టడం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం’ అని అన్నారు.
కాగా, బీజేపీ మంత్రి రతన్ లాల్ నాథ్ వ్యాఖ్యలపై త్రిపుర టీఎంసీ అధ్యక్షుడు సుబల్ భౌమిక్ మండిపడ్డారు. మాజీ సీఎం బిప్లబ్ దేబ్ను దేశంలోని గొప్ప వ్యక్తులతో పోల్చి వారిని ఆయన అవమానించారని విమర్శించారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలపై కనీస పరిజ్ఞానం లేని వ్యక్తులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు.
There are times when great men are born in our country & the world…like Subhash Bose, Tagore, Mahatma Gandhi, Vivekananda, Einstein…Good for us that in our state one such person Biplab Deb was born. He has given us new direction: Tripura education minister Ratan Lal Nath pic.twitter.com/P3dy9c90nL
— ইন্দ্রজিৎ | INDRAJIT (@iindrojit) May 22, 2022