అగర్తలా, మే 14: బీజేపీ ముఖ్యమంత్రుల పోస్టులకు గ్యారంటీ లేకుండా పోతున్నది. కాంగ్రెస్ ఆనవాయితీని పుణికిపుచ్చుకున్న బీజేపీ.. ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో వరుసగా సీఎంలను మారుస్తున్నది. ఆ పార్టీ అధికారంలోని ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ పదవికి రాజీనామా చేశారు. శనివారం మధ్యాహ్నం రాజ్భవన్లో గవర్నర్ ఎస్ఎన్ ఆర్యను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దేబ్ రాజీనామా అనంతరం భేటీ అయిన బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మాణిక్ సాహాను కొత్త సీఎంగా ఎంపిక చేసింది. వృత్తిరీత్యా డెంటిస్ట్ అయిన సాహా.. 2016లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. కాగా, పార్టీ సమావేశంలో సాహాను సీఎంగా దేబ్ ప్రతిపాదించగానే, మంత్రి రాంప్రసాద్ పౌల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కుర్చీలను విరగ్గొట్టారు. డిప్యూటీ సీఎం జిష్ణు దేవ్ వర్మను సీఎంగా ఎంపిక చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సాహా ఎంపికను పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించినట్టు సమాచారం.
ఓటమి భయంతోనే?!
త్రిపురలో పాతికేండ్ల వామపక్ష పాలనకు తెరదించుతూ రాష్ట్ర పదో ముఖ్యమంత్రిగా 2018 మార్చిలో దేబ్ ప్రమాణం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో సీఎం విఫలమయ్యారంటూ విపక్షాలు ఆరోపించడం, సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి సెగలు పెరుగడం, రాష్ట్రంలో తృణమూల్ అంతకంతకూ విస్తరించడం, వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండటం, గెలుపు అవకాశాలు సన్నగిల్లుతుండటం తదితర అంశాలను పరిశీలించిన తర్వాతనే బీజేపీ అధిష్ఠానం సీఎం మార్పునకు మొగ్గు చూపినట్టు సమాచారం. కాగా, పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో పూర్తిచేసినట్టు రాజీనామా అనంతరం దేబ్ పేర్కొన్నారు.
బీజేపీ అంతానికి నాంది
దేబ్ రాజీనామాపై విపక్ష తృణమూల్ స్పందించింది. దేబ్ పాలనను ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించింది. బీజేపీ హయాంలో విపక్ష నేతలపై దాడులు పెరిగిపోయాయని మండిపడింది. దేబ్ రాజీనామా త్రిపురలో బీజేపీ అంతానికి నాంది అని, రాష్ట్ర ప్రజలకు ఎట్టకేలకు విముక్తి లభించిందని వెల్లడించింది.
వాళ్లకు మార్పు సహజమే
ఎన్నికల ముందు సీఎంల మార్పు బీజేపీకి కొత్తేమీ కాదు. గత ఏడాదిలో కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్లో ముఖ్యమంత్రులను ఆ పార్టీ అధిష్ఠానం మార్చింది. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని యెడియూరప్పను కర్ణాటక సీఎంగా తప్పించి ఆ పదవిని బసవరాజు బొమ్మైకు కట్టబెట్టింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో గత ఏడాది సీఎంగా విజయ్ రూపానీని తొలగించి ఆ బాధ్యతలను భూపేంద్ర పటేల్కు అప్పగించింది. ఈ ఏడాది మొద ట్లో ఉత్తరాఖండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అయితే ఈ ఎన్నికలకు ఏడాది ముందు ఏకంగా ముగ్గురు సీఎంలు మార్చింది. త్రివేంద్రసింగ్ను తొలగించి. తీరత్ సింగ్ను, ఆయన్ని తొలగించి పుష్కర్ సింగ్ను కొత్త సీఎంగా ప్రకటించింది.