Trinamool | ఇండియా గేట్ దగ్గర ప్రముఖ స్వాతంత్య్ర సరమయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తృణమూల్ కాంగ్రెస్ స్వాగతించింది. అయితే నేతాజీ మరణం వెనుక వున్న మిస్టరీని కేంద్రం బయటపెడితే మరింత బాగుంటుందని అభిప్రాయపడింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. అయితే గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నేతాజీ శకటానికి అనుమతిస్తే వచ్చే నష్టమేమీ లేదు. కేవలం వక్రబుద్ధితోనే ఇలా చేశారు. విగ్రహాల విషయంలో కేంద్రం ఏం చేస్తుందో మనకు తెలిసిందే. అందుకే నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు అని ముకుల్ రాయ్ అన్నారు.
ఇక తృణమూల్ ప్రధాన కార్యదర్శి కునల్ ఘోష్ మాట్లాడుతూ.. నేతాజీ శకటాన్ని కేంద్రం తిరస్కరించిందని, ఇది వివాదాస్పదంగా మారిందని గుర్తు చేశారు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. అయినా.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ప్రకటించారు.
ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రానైట్తో తయారు చేసిన నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నందుకు ఎంతో ఆనందంగా వుందని మోదీ ప్రకటించారు. భారత్ ఆయనకు రుణపడి ఉండేందుకు ఇది చిహ్నంగా నిలుస్తుందన్నారు. విగ్రహ నిర్మాణం పూర్తయ్యే వరకూ ఐకానిక్ స్మారక చిహ్నం వద్ద నేతాజీ హోలోగ్రామ్ను ఉంచుతామని మోదీ ప్రకటించారు. ఈ విగ్రహం 28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉంటుందని అధికారులు తెలిపారు.