Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో జతకట్టకతప్పదని కాంగ్రెస్ భావిస్తున్నా ఆ పార్టీ ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో తమకు ఐదు స్ధానాలు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబడుతుండగా మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అందుకు ససేమిరా అంటోంది.
2019 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ రెండు స్ధానాల్లో గెలిచిందని ఆ రెండు స్ధానాలే కేటాయిస్తామని సీఎం మమతా బెనర్జీ తేల్చిచెబుతున్నారు. ఇక బైనాక్యులర్స్తో పరిశీలించినా కాంగ్రెస్కు మూడో సీటు ఇవ్వడం కష్టమే అని టీఎంసీ వర్గాలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్కు రెండు ఎంపీ స్ధానాలు కేటాయిస్తూ త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని టీఎంసీ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రస్తతం బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న బెర్హంపూర్, మాల్దా, డార్జెలింగ్, మాల్ధా (నార్త్), రాయ్గంజ్ స్ధానాల కోసం కాంగ్రెస్ పట్టుబడుతోంది. బీజేపీ గెలుపొందిన పురూలియా స్ధానాన్ని కూడా కాంగ్రెస్ కోరుతోందని టీఎంసీ వర్గాలు తెలిపాయి.
అయితే బెంగాల్లో కాంగ్రెస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని, అయినా తాను ఆ పార్టీకి రెండు లోక్సభ స్ధానాలు కేటాయించి గెలిపిస్తానని ఆఫర్ చేశానని దీదీ చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ అంగీకరించలేదని, దీంతో వారికి ఇక ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని ఆమె చెబుతున్నారు. కాంగ్రెస్ మాత్రం విపక్ష భాగస్వాములతో జట్టు కట్టేందుకు బెట్టు వీడి చర్చలు జరిపేందుకు మొగ్గుచూపుతోంది. యూపీలో ఎస్పీతో ఆప్తో పలు రాష్ట్రాల్లో పొత్తు ఖరారు చేసుకున్న కాంగ్రెస్ తృణమూల్తోనూ సీట్ల సర్దుబాటుకు ఆసక్తి కనబరుస్తోంది. మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో పొత్తు దిశగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేరుగా చర్చలు జరుపుతున్నారు.
Read More :
ED Raids: బెంగాల్లో పీడీఎస్ స్కామ్.. ఆరు చోట్ల ఈడీ సోదాలు