అగర్తలా : తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుష్మిత దేవ్పై త్రిపురలో శుక్రవారం దాడి జరిగింది. ఆమెను కారును ధ్వంసం చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకుల పనేనని టీఎంసీ నాయకులు పేర్కొన్నారు. ఈ దాడిలో సుష్మిత దేవ్కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆమెకు ఓ ప్రయివేటు కంపెనీ ఉద్యోగులు సహాయం చేసి దాడి నుంచి తప్పించారు. ఎంపీ వెంట ఉన్న మరో 10 మంది కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని, అందులో భాగంగానే ఈ దాడి చేశారని టీఎంసీ నాయకులు పేర్కొన్నారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఉద్యోగులతో సుష్మిత దేవ్ సమావేశమైన సందర్భంగా ఈ దాడి జరిగింది. టీఎంసీ నాయకుల ఫోన్లను కూడా దొంగిలించారు. ఈ ఘటనపై టీఎంసీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.