న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ గందరగోళం నెలకొన్నది. పెగాసస్ స్పైవేర్ అంశంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేస్తున్న సమయంలో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనుచితంగా వ్యవహరించారు. మంత్రి వైష్ణవ్ చేతుల్లోంచి స్టేట్మెంట్ పేపర్లు లాగారు. ఆ తర్వాత ఆ పేపర్లు చింపివేసి .. వెల్లోనే వెదజల్లారు. టీఎంసీ ఎంపీల వైఖరిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. ఎంపీల ప్రవర్తన తీరును డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఖండించారు. గందరగోళం నడుమ ఆయన సభను రేపటికి వాయిదా వేశారు. గతంలోనూ టీఎంసీ ఎంపీలు.. నూతన రైతు చట్టాలను ప్రవేశపెడుతున్న సమయంలో.. చైర్ మైక్ లాగేసిన విషయం తెలిసిందే.
తాజాగా టీఎంసీ ఎంపీ శంతను సేన్.. మంత్రి వైష్ణవ్ చేతుల్లోంచి పేపర్లు లాగేసినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పురతి, ఎంపీ శంతను సేన్ మధ్య మాటల ఘర్షణ కొనసాగింది. పెగాసస్ ప్రాజెక్టు రిపోర్ట్ను చదువుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. టీఎంసీ ఎంపీల ప్రవర్తనను బీజేపీ ఎంపీ స్వపన్దాస్ గుప్తా ఖండించారు. మంత్రి చేతుల్లోంచి పేపర్ లాగేసిన అంశాన్ని ప్రశ్నించగా.. ఎంపీ ఎంపీ సుకేందు శేఖర్ రాయ్ సమాధాన్ని దాటవేశారు.