న్యూఢిల్లీ, నవంబర్ 12: బిల్కిస్ రేపిస్టులు సంస్కారులన్న వ్యక్తికి బీజేపీ టికెట్ ఇవ్వడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ సహా బీజేపీ నాయకులు పదే పదే వల్లెవేస్తున్న ‘గుజరాత్ మాడల్’ అంటే.. ‘ద్వేషించడం, చంపడం ఆపై బహుమతి పొంది సంబురం చేసుకోవడమే’నని స్పష్టం చేశారు.
బిల్కిస్ రేపిస్టులను సంస్కారులన్న గోద్రా ఎమ్మెల్యే చంద్రసిన్హ్ రౌల్జీకి బీజేపీ మళ్లీ టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. హత్యాచార దోషులను ‘మంచి సంస్కారవంతులు’గా బీజేపీ అభివర్ణిస్తున్నదని, ఇప్పటివరకూ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంతటి హీన స్థితికి దిగజారి మాట్లాడలేదని టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ వై సతీశ్రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన చంద్రసిన్హ్ రౌల్జీ.. గుజరాత్లోని గోద్రా నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతోపాటు గతంలో ఆ రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు.