కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. బీజేపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు తమతో టచ్లో ఉన్నారని పేర్కొంది. (BJP MPs in touch) అయితే టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది తప్పుడు ప్రచారమని విమర్శించింది. బెంగాల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ఏడు దశల్లో జరిగింది. ఈసారి మమతా బెనర్జీకి బీజేపీ షాక్ ఇస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. టీఎంసీ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని పేర్కొన్నాయి.
కాగా, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని తేలింది. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ గత లోక్సభ ఎన్నికల కంటే ఈసారి మెరుగైన సీట్లు సాధించింది. 2019లో టీఎంసీ 22 సీట్లు గెలుచుకోగా ఈసారి 29 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు బీజేపీ గతం కంటే దిగజారింది. 2019లో బీజేపీ 18 సీట్లు గెలుచుకోగా ఈసారి 12 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.