న్యూఢిల్లీ: టోక్యోలో ఒలింపిక్స్లో భారత ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ గెలిచిన క్షణాలను ఆయన తన మాటల్లో వ్యక్తపరిచారు. ఇవాళ రాజ్యసభ సమావేశమైన తర్వాత.. ఒలింపిక్స్లో భారత బృందం ఇచ్చిన ప్రదర్శనల పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారు. గడిచిన 120 ఏళ్ల చరిత్రలో.. భారత్కు గతంలో ఎన్నడూ ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఒక్క పతకం కూడా రాలేదన్నారు. టోక్యో ఒలింపిక్స్ మన దేశం ఉత్తమ ప్రదర్శన ఇచ్చిందని, అత్యధిక సంఖ్యలో మెడల్స్ సాధించిందని, ఇంకా చాలా మంది అథ్లెట్లు మెడల్ విన్నింగ్ రౌండ్లోకి ఎంటర్ అయ్యారని వెంకయ్య తెలిపారు. క్రీడల పట్ల సన్నగిల్లి ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ టోక్యో ఒలింపిక్స్ ద్వారా పొందామన్నారు.
ఒలింపిక్ మైదానంలో మన త్రివర్ణ పతాకం 13 ఏళ్ల విరామం తర్వాత ఎగిరిందని, 140 కోట్ల మంది భారతీయుల్లో ఆ సమయంలో ఆనందం వెల్లివిరిసిందని, జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో భారతీయుల భావోద్వేగాలకు గురైన ఆనందభాష్పాలను రాల్చారన్నారు. మెడల్స్ లిస్టులో టాప్లో నిలవాలన్న లక్ష్యంతో భవిష్యత్తులో భారత్ ముందుకు వెళ్లాలన్నారు. టోక్యోకు వెళ్లిన బృందంలో 40 శాతం మంది హర్యానా, పంజాబ్ అథ్లెట్లు ఉన్నారని, క్రీడాంశాల్లో దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలుపుతున్న ఈ రెండు రాష్ట్రాలను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బ్రిటీష్ పరిపాలిత దేశంగా 1900 సంవత్సరంలో తొలిసారి పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో ఇండియా పాల్గొన్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. 1980 వరకు హాకీలో గోల్డెన్ రికార్డు ఉండేదని, ఆ తర్వాత అడపాదడపా కొందరు అథ్లెట్లు మెరిసారని, క్రీడాకారుల్లో తగ్గిన ఆత్మవిశ్వాసం, నమ్మకం.. మళ్లీ టోక్యో ఒలింపిక్స్లో తారాస్థాయికి చేరినట్లు ఆయన తెలిపారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో షూటర్ అభినవ్ బింద్రాకు గోల్డ్ మెడల్ వచ్చిందన్నారు. గోల్డెన్ త్రోతో నీరజ్ చోప్రా మన దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారన్నారు.నీరజ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్లు వెంకయ్య మెచ్చుకున్నారు.