భోపాల్ : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(PMAY)తో పాటు టాయిలెట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేసిన ఓ గిరిజన యువకుడిని ప్రభుత్వ ఉద్యోగులు చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని కత్నీ జిల్లాలో చోటు చేసుకుంది. ధిమర్కేడ గ్రామంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, టాయిలెట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని పంచాయతీరాజ్ అధికారులకు ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. ఈ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు.
ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు కోపంతో ఊగిపోయి, యువకుడిపై దాడి చేశారు. అధికారుల వెంట ఉన్న పోలీసు కూడా బాధిత వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తీవ్రంగా స్పందించారు. యువకుడిపై దాడి చేసిన ప్రభుత్వ అధికారులను, పోలీసును విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.