Trees for life | లేహ్, మే 17: హిమాలయాల్లో పర్యావరణ మార్పుల్ని ఎదుర్కొనడానికి, బంజరు భూములు పాడుబడకుండా లడఖ్లోని ప్రభుత్వం చెట్ల పెంపకాన్ని ఓ ఉద్యమంలా చేపట్టింది. ‘జీవితం కోసం చెట్లు’ (ట్రీస్ ఫర్ లైఫ్) కార్యక్రమాన్ని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు బుధవారం అధికారికంగా ప్రారంభించారు. లడఖ్లోని వివిధ వర్గాలకు చెందిన వారు, భూటాన్, నేపాల్కు చెందిన వలంటీర్లు తొలిరోజు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్థానిక ప్రజలు, ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ ఎన్జీవో సంస్థ ‘లివ్ టు లవ్’ కార్యకర్తలు ఒక్క రోజులో లక్ష చెట్లను నాటి రికార్డు సృష్టించారు. వివిధ రకాల చెట్లు, మొక్కలు నాటడానికి ఐదువేల మంది పౌరులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. మొత్తం 19ఎకరాల విస్తీర్ణం కలిగిన సువిశాల ప్రదేశంలో లడఖ్ ప్రభుత్వం, లివ్ టు లవ్ సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. నేరేడు, యాపిల్ పండ్ల చెట్లు, అడవుల్లో పెరిగే పొప్లర్ చెట్లను పెద్ద సంఖ్యలో నాటారు. తద్వారా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు భూమి కోతకు గురికాకుండా ఉంటుందని నిపుణులు తెలిపారు.