Thomas Cook : వినియోగదారుడికి సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి రోడ్డు ప్రమాదంలో అతను తన కుటుంబాన్ని కోల్పోవడానికి కారణమైన థామక్ కుక్ (Thomas Cook), రెడ్ ఆపిల్ (Red apple) ట్రావెల్ కంపెనీలు బాధితుడికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని ఢిల్లీ కన్జూమర్ కమిషన్ ఆదేశించింది. రోడ్డు ప్రమాదంలో బాధితుడు తన కుటుంబాన్ని కోల్పోవడమే కాకుండా, చాలా రోజులపాటు అతను షాక్లో ఉండిపోయాడని కమిషన్ ఈ సందర్భంగా ప్రస్తావించింది.
వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన యోగేశ్ సైగల్ 2019లో కుటుంబంతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లారు. ఇందుకోసం ఢిల్లీకి చెందిన ట్రావెల్స్ కంపెనీ థామస్ కుక్కు రూ.3.46 లక్షలు చెల్లించి ప్యాకేజీ మాట్లాడుకున్నాడు. అయితే ట్రావెల్స్ కంపెనీ ముందు చెప్పిన దానికి విరుద్ధంగా శ్రీలంకలో చిన్న వాహనంలో వారిని తిప్పింది. ఈ క్రమంలో కొలంబోలో వారు ప్రయాణిస్తున్న వాహనం కంటెయినర్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో యోగేశ్ సైగల్ భార్య, కుమారుడు, కుమార్తె, మామ ప్రాణాలు కోల్పోయారు. సైగల్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. కోలుకున్న తర్వాత అతను 2021లో థామస్ కుక్, రెడ్ యాపిల్ కంపెనీలపై నష్ట పరిహారం కోసం వినియోగదారుల కమిషన్లో దావా వేశారు. దానిపై విచారణ జరిపిన కన్జూమర్ కమిషన్.. నిర్లక్ష్యంగా వ్యవహరించి బాధితుడి జీవితాన్ని అంధకారం చేసినందుకుగాను అతనికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది.