పాట్నా : బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం పెళ్లికి వెళ్తి వస్తుండగా.. కారు బోల్తాపడిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా.. వారిద్దరిని ఔరంగాబాద్ సదర్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గయాకు రెఫర్ చేశారు. మరోవైపు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాఘి కోయెల్ సమీపంలో చోటు చేసుకున్నది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్లోని పాలము ఛతర్పూర్ నుంచి ఏడుగురు యువకులు పెళ్లికి హాజరయ్యేందుకు బిహార్లోని నబీనగర్కు వచ్చారు. వివాహ వేడుకకు హాజరై తిరిగి కారులో వెళ్తుండగా.. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కారు అదుపు తప్పి నదిలో పడిపోయింది. సంఘటనలో స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. మృతులంతా 18 నుంచి 19 ఏళ్లలోపు యువకులేనని, మృతులు జార్ఖండ్లోని ఛతర్పూర్ వాసులని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.