న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో 197 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ శుక్రవారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొవిడ్ చికిత్స కోసం స్టెరాయిడ్లు తీసుకోవాలని, వైద్యుల సూచన మేరకు వాడాలని, ప్రొఫెషనల్ను సంప్రదించకుండా వాడడం సరికాదన్నారు. బ్లాక్ ఫంగస్ రెండు కారణాలతో సోకుతుందని.. రక్తంలో షుగర్ లెవల్స్ పెగరడం వల్ల, సెర్టాయిడ్ల వాడకంతోనని తెలిపారు. వైద్యుల సలహా మేరకే తీసుకోవాలని సూచించారు. ఫంగస్ మట్టిలో, కుళ్లిపోయిన వస్తువుల్లో కనిపిస్తుందన్నారు. ఇది ఆరోగ్యకరమైన వ్యక్తిపై ప్రభావం చూపదన్నారు.
స్టెరాయిడ్స్ వాడి, మానివేసిన వారంతా కనీసం వారం రోజులు ఇల్లు విడిచి వెళ్లొద్దని సూచించారు. ఇదిలా ఉండగా.. దేశ రాజధానిలో కొవిడ్-19 కేసులపై స్పందిస్తూ.. కొవిడ్ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.5శాతంగా ఉందని తెలిపారు. కొత్తగా 3,231 కేసులు నమోదయ్యాయని తెలిపింది. రోజువారి కేసులు 28వేల నుంచి మూడువేలకు పడిపోయాయని.. 36శాతం వరకు పెరిగిన పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5.5శాతానికి తగ్గిందన్నారు. ప్రజలు వైరస్ తగ్గుముఖం పట్టిందని, తేలిగ్గా తీసుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ ప్రవర్తనా నియమాలు పాటించాలని సూచించారు. 18-44 మధ్య వయస్సు వారికి టీకాలు వేసేందుకు అందుబాటులో లేవని, త్వరలోనే డోసులు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.