హైదరాబాద్: సాయుధ దళాల్లో పరిస్థితులకు తగినట్లు సంస్కరణలను చేపడుతున్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. ఇవాళ దుండిగల్లో జరిగిన ఎయిర్ఫోర్స్ అకాడమీ పరేడ్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ జరిగిన ఈవెంట్లో మాట్లాడుతూ.. సరిహద్దుల్లోనూ, దేశంలోనూ సవాళ్లు పెరిగాయని, దానికి తగినట్లు సంసిద్ధంగా ఉండే రీతిలో దళాలను ఆధునీకరిస్తున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ రోబోటిక్స్, హైపర్సోనిక్స్ లాంటి కొత్త టెక్నాలజీతో యుద్ధ రంగం భిన్నంగా మారిందని, దానికి తగినట్లే సంస్కరణలు తప్పవన్నారు. సాయుధ బలగాలకు చెందిన మానవ వనరుల రంగంలోనూ సంస్థాగత సంస్కరణలు చేపడుతున్నామని, ఆత్మనిర్భర్ భారత్పై దృష్టిపెడుతూ ఇతర రంగాల వృద్ధిపై ఫోకస్ పెట్టినట్లు ఆయన తెలిపారు. భారత్లో భద్రత చాలా విశాలమైందని, సంక్లిష్టమైందని, బహుముఖంగా ఉంటుందని ఆయన అన్నారు. బోర్డర్ల వద్ద, ఇంటర్నల్ సెక్యూర్టీ సమస్యల వల్ల నిత్యం సంసిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. టెక్నాలజీపై దృష్టి పెట్టడం ఇప్పుడు ఆప్షన్ కాదని, అతి అత్యవసరమని ఆర్మీ చీఫ్ తెలిపారు.