లక్నో: పైలట్లకు శిక్షణ ఇచ్చే చిన్న విమానం కూలిపోయింది. అందులో ఉన్న మహిళా ట్రైనీ పైలట్ ఈ ప్రమాదంలో గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (Trainee aircraft crashes) ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం సాధారణ శిక్షణ సందర్భంగా విమానం కూలిపోయింది. జాతీయ రహదారి సమీపంలో అది కూలడంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే ప్రమాద స్థలానికి వారు చేరుకున్నారు. అత్యవసర సహాయక బృందాలు రాకముందే కూలిన విమానంలోని మహిళా ట్రైనీ పైలట్ను రక్షించారు.
కాగా, గాయపడిన లేడీ ట్రైనీ పైలట్కు స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం ఆగ్రాకు తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తునకు ఎటువంటి ఆటంకం కలగకుండా నిరోధించడానికి పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు.
మరోవైపు శిక్షణ విమానం ప్రమాద కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. సాంకేతిక లోపం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించామని, దర్యాప్తు పూర్తయ్యాక ప్రమాదానికి గల కారణం తెలుస్తుందని జిల్లా యంత్రాంగం తెలిపింది. అయితే విచారణలో భాగంగా సంబంధిత ఏజెన్సీల అధికారులు విమాన శిథిలాలను పరిశీలించారు. ట్రైనీ ఫ్లైట్ ప్రమాదానికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు సేకరించారు.