పాట్నా : అంత్యక్రియలకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన బిహార్లోని జుమైలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. ట్రక్కు – కారు ఢీకొన్న సంఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాతపడగా.. మరో నలుగురు తీవ్ర గాయాలకు గురయ్యారు. క్షతగాత్రులను వెంటనే ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు హల్సీ పోలీస్స్టేషన్ పరిధిలోని సికంద్రా – షేక్పూర్ ప్రధాన రహదారిపై పిప్రా గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది.
జుమైలోని ఖైరా బ్లాక్లోని నౌదిహాకు చెందిన కొందరు దహన సంస్కారాల కోసం పాట్నా వెళ్లారు. తిరిగి వయస్తున్న సమయంలో పిప్రా గ్రామ శివారులో కారును ట్రక్కు ఢీకొట్టింది. రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టుకోవడంతో ఆరుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతులు, క్షతగాత్రులను గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.