న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతున్నది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సందర్భంగా దేశ ఆయుధ శక్తితోపాటు వివిధ కేంద్ర రాష్ట్రాల విశిష్టతలను చూటుతూ నిర్వహించే శకటాల ప్రదర్శన ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటుంది. దీనికోసం త్రివిధ దళాలతోపాటు కాళాకారులు, శకటాల ప్రదర్శనకు సంబంధించి అధికారులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఢిల్లీలో ఫుల్డ్రెస్ రిహార్సల్స్ జరుగనున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు విజయ్ చౌక్లో ప్రారంభమయ్యే పరేడ్.. కర్తవ్య పథ్, సీ-హెక్సాగాన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం, తిలక్మార్గ్, బహదూర్ షా జాఫర్ మార్గ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మార్గ్ మీదుగా ఎర్రకోటకు చేరుకుంటుంది. ఇందులో త్రివిధ దళాలు, పారా మిలిటరీ బలగాల విన్యాసాలు, సైనికుల కవాతు, కేంద్ర రాష్ట్ర శకటాలను ప్రదర్శించనున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్తవ్యపథ్ మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి నుంచి ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకు కర్తవ్యపథ్ నుంచి విజయ్ చౌక్ వరకు ఎలాంటి వాహనాలను అనుమతించేది లేదని ప్రకటించారు.