Railways | రోజురోజుకు టికెట్లు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారు పెరిగిపోతూనే ఉన్నారు.
గతేడాది (2022-23)లో టికెట్లు లేకుండా సుమారు 3.6 కోట్ల మంది రైలు ప్రయాణం చేశారని రైల్వేశాఖ తెలిపింది. వీరిపై రూ.2200 కోట్ల ఫైన్ విధించినట్లు వెల్లడించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన పిటిషన్కు రైల్వేశాఖ ఈ జవాబు చెప్పింది.
2019-20లో 1.10 కోట్ల మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తుండగా రైల్వేశాఖ అధికారులు తెలిపారు. 2021-22లో ఈ సంఖ్య 2.7 కోట్ల మందికి చేరుకున్నది. ఇలా పట్టుబడిన ప్రయాణికుల నుంచి 2021-22లో రూ.1574 కోట్లు జరిమానా వసూలు చేసినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. అంతకు ముందు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల 32.56 లక్షల మంది ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణించారు. వారి నుంచి రూ.152 కోట్ల ఫైన్ వసూలు చేశారు.
ఇదిలా ఉంటే టికెట్ కొనుగోలు చేసిన వారు ప్రయాణం చేయలేకపోవడం ఆసక్తికర పరిణామం. 2022-23లో 2.7 కోట్ల మందికి పైగా ప్రయాణికుల టికెట్లు వెయిటింగ్ లిస్ట్లో ఉండటంతో ప్రయాణం చేయలేకపోయారని తేలింది. దేశవ్యాప్తంగా పలు రూట్లలో ప్రయాణికుల రద్దీ ఉన్న రైళ్లలో ఈ పరిస్థితి ఉన్నట్లు తెలుస్తున్నది.
టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే వారు టికెట్ ధరతోపాటు అదనంగా రూ.250 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా చెల్లించలేకపోతే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు అప్పగిస్తారు. ఆర్పీఎఫ్ జవాన్లు రైల్వేచట్టంలోని 137 సెక్షన్ కింద కేసు నమోదు చేసి జడ్జి ముందు హాజరు పరుస్తారు. జడ్జి రూ.1000 జరిమానా విధిస్తారు. ఆ జరిమానా చెల్లించలేని ప్రయాణికులు ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటది.