న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా రోగులకు తీవ్ర ఆక్సిజన్ కొరత ఉన్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం రాత్రి నగరంలో ఉన్న మూడు ప్రధాన ఆస్పత్రులకు ఆక్సిజన్ చేరుకున్నది. ఆక్సిజన్ సరఫరాను పెంచాలంటూ కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించడంతో.. ఢిల్లీలోని హాస్పిటళ్లకు మళ్లీ ఆక్సిజన్ సరఫరా పెరిగింది. సర్ గంగా రామ్ హాస్పిటల్, జీటీబీ హాస్పిటళ్లకు కొత్త ఆక్సిజన్ ట్యాంకులు వచ్చాయి. 5వేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సిలిండర్లు గంగారామ్ హాస్పిటల్కు వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఆ హాస్పిటల్లో పదివేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ అవసరం ఉన్నది. కానీ గంగారామ్ హాస్పిటల్కు 14వేల క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ చేరుకున్నట్లు గంగారామ్ హాస్పిటల్ చైర్మన్ డీఎస్ రాణా ఓ మీడియాతో పేర్కొన్నారు. మరో రెండు రోజుల వరకు ఆ నిల్వలు సరిపోతాయన్నారు. ప్రభుత్వ ఆధీనంలో నడిచే జీటీబీ హాస్పిటల్కు కూడా గత రాత్రి ఆక్సిజన్ సరఫరా జరిగింది.
ప్రతాప్గంజ్లో ఉన్న మ్యాక్స్ హాస్పిటల్కు ఐనాక్స్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లు వచ్చాయి. కానీ ఇవాళ మధ్యాహ్నం వరకు సరిపోతుందని డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్లో 300 మంది రోగులు ఉండగా.. ప్రస్తుతం 200 మంది ఆక్సిజన్పై ఆధారపడి ఉన్నారని అధికారులు చెప్పారు. జీటీబీ హాస్పిటల్లో కూడా 500 మంది కరోనా పేషెంట్లు ఆక్సిజన్పై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.