Vegetable prices | న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 27: ఉల్లిపాయలే కాదు.. టమాటాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని మధ్య తరగతి వాపోతున్నారు. వంటల్లో ఎక్కువగా వాడే టమాటా ధరలు మండిపోతుంటే కూరలెలా వండాలని మహిళలు మథన పడుతున్నారు. వారం క్రితం వరకు రూ.30-40 పలికిన టమాటాలు నేడు అమాంతంగా రూ.100కు చేరాయి. బీన్స్, క్యారెట్, క్యాప్సికం, దొండ కాయల లాంటి కూరగాయల ధరలు కూడా సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. తగ్గిన కొనుగోళ్లతో లాభాలు తగ్గాయని వ్యాపారులూ వాపోతున్నారు.
నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడం, ఉత్తరాదిలో వరదల వల్ల సరఫరాకు ఆటంకం కలగడం, వర్షాల వల్ల టమాటాలు దెబ్బ తినడం, కర్ణాటకలో సాగు తగ్గడం తదితర కారణాల వల్ల ధరలు ఒక్క వారంలోనే అమాంతంగా పెరిగిపోయాయని దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు చెప్తున్నారు. దీంతో మధ్యప్రదేశ్ నుంచి తగినన్ని టమాటాలు దిగుమతి చేసుకోవడానికి ఢిల్లీ వ్యాపారులు రైతులతో చర్చలు జరుపుతున్నారు. హర్యానా, యూపీల నుంచి తక్కువ సరఫరా ఉండటంతో బెంగళూరు నుంచి సరఫరా అయ్యే టమాటాలపై ఉత్తరాది వ్యాపారులు ఎక్కువగా ఆధారపడుతున్నారు.
వివిధ నగరాల్లో కిలో టమాటా ధర వంద రూపాయలు దాటింది. హైదరాబాద్లో మాత్రం రూ.100గా ఉంది. గోరఖ్పూర్లో అత్యధికంగా రూ.122, ఇండోర్లో రూ.110 ధర పలుకుతున్నాయి. దీంతో కోలార్ హోల్సేల్ ఏపీఎంసీ మార్కెట్లో 15 కిలోల టమాటా పెట్టె రూ.1100 ధర పలుకుతున్నది. ఈ ఏడాది బీన్స్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కోలార్ జిల్లాలోని చాలా మంది రైతులు టమాటా సాగును వదిలి బీన్స్ వైపు మళ్లారని అంజిరెడ్డి అనే రైతు తెలిపారు. మరోవైపు రిటైల్ మార్కెట్లో కిలో అల్లం రూ.400, బీన్స్ రూ.120-140, క్యారెట్ రూ.100, క్యాప్సికం రూ.80, కాకరకాయలు, దొండకాయలు రూ.60-70, గుడ్డు రూ.7-8 ధర పలుకుతున్నాయి. ధరలు పెరగడంతో సామాన్యులు కొనుగోళ్లు తగ్గించారని వ్యాపారులు వివరించారు.
మోదీ తప్పుడు విధానాల వల్లే
ప్రధాని మోదీ తప్పుడు విధానాల వల్లే టమాటా ధరలు పెరిగాయని కాంగ్రెస్ విమర్శించింది. ‘టమాటాలు, ఉల్లిగడ్డ లు, ఆలు గడ్డలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని చెప్పారు. కానీ ఆయన తప్పుడు విధానాల వల్ల టమాటాల ధర కిలో రూ.100 చేరుకొంది’ అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.
పెరుగుదల తాత్కాలికమే
వర్షాలు టమాటాల రవాణాపై ప్రభావం చూపాయని, ఈ కారణంగానే ధరలు పెరిగాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ వెల్లడించారు. ధరల పెరుగుదల తాత్కాలికమేనని, త్వరలోనే ధరలు తగ్గుతాయని ఆయన తెలిపారు. తమ శాఖ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం దేశ వ్యాప్తంగా మంగళవారం కిలో టమాటాల సగటు ధర రూ.46 అని చెప్పారు. 2021-22లో దేశ వ్యాప్తంగా 20.69 మిలియన్ టన్నుల టమాటాలు ఉత్పత్తి కాగా 2022-23లో అది కాస్త తగ్గి 20.62 టన్నులకు పడిపోనుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.