Tomato | ప్రతి రోజు కూరల్లో టమోటాలు వాడుతుంటాం.. వేసవిలోనూ తక్కువ ధరకు అందుబాటులో ఉన్న టమోటాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యధిక మార్కెట్లలో కిలో రూ.100 పలుకుతున్నది. హోల్ సేల్ మార్కెట్లలో రూ.65-70 మధ్య లభిస్తున్నాయి. వారం క్రితం వరకు హోల్ సేల్ మార్కెట్లో రూ.30-35 మధ్య పలికిన టమోటా రిటైల్ మార్కెట్లో రూ.40-50 మధ్య లభించాయి. కానీ రుతు పవనాలు ఆలస్యం కావడంతో రిటైల్ మార్కెట్లో కిలో టమోటా ధరలు దాదాపు రెట్టింపయ్యాయి.
మండు వేసవిలో అంటే గత నెలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలతోపాటు దేశమంతటా కిలో టమోటా రూ.2-5 మధ్య పలికింది. కానీ, ఇప్పుడు కిలో టమోటా ధర కేవలం నెల రోజుల్లో 1900 రెట్లు పెరిగింది. ఢిల్లీ మార్కెట్లలో కిలో టమోటా రూ.70-100 మధ్య విక్రయిస్తున్నారు. మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలో రూ.80-100 మధ్య ఉండగా, రాజస్థా్న్లో రూ.90 నుంచి రూ.110 మధ్య పలుకుతున్నాయి. పంజాబ్ లో రూ.60-80 మధ్య లభిస్తున్నాయి.
పలు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా టమోటా తోటలు దెబ్బ తిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడి వల్ల దిగుబడి తగ్గింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి టమోటాల సరఫరా గణనీయంగా తగ్గింది. గతంతో పోలిస్తే రైతులు టమోటా సాగు తగ్గించారని తెలుస్తున్నది.
హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి టమోటా సరఫరా తగ్గిపోవడంతో వారంలో హోల్సేల్ మార్కెట్లలో ధరలు రెట్టింపయ్యాయని ఢిల్లీలోని ఆజాద్ పూర్ హోల్ సేల్ మార్కెట్ వ్యాపారి అశోక్ గనోర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూడా ధరలు పెరిగాయన్నారు.
రైతులు కూడా గిట్టుబాట ధర లభించక పోవడంతో టమోటా తోటల్లో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడటం లేదు. ఫలితంగా టమోటా తోటలపై చీడ పీడలు పెరిగిపోయి దిగుబడి తగ్గిపోవడం కూడా ధరల తగ్గుదలకు కారణం అని మహారాష్ట్రలోని నారాయణ్ గావ్ ప్రాంత రైతు అజయ్ బెల్హెకర్ తెలిపారు.
ఇటీవల వచ్చిన బైపర్జోయ్ తుపాన్ కూడా టమోటా దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడిందని కొందరు నిపుణులు చెప్పారు. ఈ తుఫాను వల్ల గుజరాత్, మహారాష్ట్రల్లో పంట దిగుబడి తగ్గిపోయిందని. గుజరాత్ రాష్ట్రంలో పంట దిగుబడిపై తుఫాన్ ప్రభావం ఫలితంగానే ధరలు పెరిగాయి.
కొత్త పంట దిగుబడి రావడానికి కనీసం ఒకటి, రెండు నెలలు పడుతుందని రైతులు చెప్పారు. విత్తనాలు వేసిన మూడు నెలల తర్వాత వారానికి రెండు సార్లు టమోటాలు వినియోగంలోకి వస్తాయని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. టమోటా తోటలు కనీసం ఒకటి రెండు నెలల పాటు దిగుబడి ఇస్తాయని, అదీ కూడా ఆయా విత్తనాల వెరైటీ, భూమి, వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుందని చెబుతున్నారు.
2021-22లో దేశంలో 20 మిలియన్ టన్నుల టమోటాల దిగుబడి వచ్చింది. హైబ్రీడ్, లోకల్ టమోటాలు లభిస్తాయి. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రధానంగా టమోటాలు పండిస్తారు.