న్యూఢిల్లీ: నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమున్నదని ఆయన ప్రశ్నించారు. స్నేహితుడిని కాపాడుకోవడానికి మోదీ సర్కారు ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మినహా 16 విపక్షాలు అదానీ అంశంలో విచారణకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయని, అయితే ఈ అంశం నుంచి విపక్షాల దృష్టి మళ్లించేందుకు అధికారపక్షం అకస్మాత్తుగా రాహుల్గాంధీ లండన్ ప్రసంగాన్ని ముందుకు తీసుకొచ్చిందని జైరాం రమేశ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని, రాహుల్గాంధీని అప్రతిష్ఠపాలు చేయాలన్న దురుద్దేశంతో కేంద్రం ఈ ఎత్తుగడ వేసిందని మండిపడ్డారు.
పార్లమెంటు తమ వాదనలను ప్రభుత్వం ఖాతరు చేయడంలేదని జైరాం ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో నడుస్తున్నది అమృత కాలం కాదని, ఆపద కాలమని వ్యాఖ్యానించారు. అంతా నియంతృత్వం రాజ్యమేలుతోందని ఫైరయ్యారు. పార్లమెంటు సమావేశాలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, సహకరించాల్సిన బాధ్యత విపక్షాలదని, కానీ బీజేపీ సర్కారు ఉభయసభల్లో విపక్షాలను నోరు తెరువనివ్వడం లేదని ఆరోపించారు. సభలు సజావుగా సాగడం ప్రభుత్వానికే ఇష్టం లేదని ఎద్దేవా చేశారు.
#WATCH | 16 Opposition parties except TMC are demanding JPC but suddenly they (BJP) brought up an issue of what Rahul Gandhi said in London. They are presenting his statement in a distorted manner to divert attention from JPC&to defame Congress &Rahul Gandhi: Cong leader J Ramesh pic.twitter.com/MPDuGaWuik
— ANI (@ANI) March 19, 2023