ఎన్నికల సమరాంగణానికి పంచ నదుల భూమి ‘పంజాబ్’ సమాయత్తమైంది. అధికార కాంగ్రెస్, విపక్ష ఆప్, ఎస్ఏడీ కూటమి, బీజేపీ కూటమి ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. సాగు చట్టాల ఉద్యమానికి నాయకత్వం వహించిన 22 రైతు సంఘాలు కలిసి ఈ ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు ప్రకటించడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ఫలితాల్లో కీలక పాత్ర పోషించే సిక్కులు, రైతులు, హిందువులు ఏ పార్టీ వైపునకు మొగ్గు చూపుతున్నారు?
117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్కు 2017లో ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ 77 స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) 23.8 శాతం ఓటింగ్ షేర్తో 20 స్థానాలను గెలుచుకొన్నది. బీజేపీతో పొత్తు పెట్టుకొన్న శిరోమణి ఆకాలీదళ్ (ఎస్ఏడీ) కూటమికి 18 సీట్లు (ఎస్ఏడీకి 15, బీజేపీకి 3) వచ్చాయి. కాగా వచ్చే ఎన్నికల్లోనూ అధికారాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా, చండీగఢ్ స్థానిక ఎన్నికలు ఇచ్చిన గెలుపు ఉత్సాహాన్ని అలాగే కొనసాగించాలని ఆప్ కృతనిశ్చయంతో ఉన్నది. రైతు సంఘాలు ఏర్పాటు చేసిన సంయుక్త సమాజ్ మోర్చా (ఎస్ఎస్ఎం) ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకొంటున్నది. ఎస్ఏడీ-బీఎస్పీ కూటమి, బీజేపీ-పీఎల్సీ-ఎస్ఏడీఎస్ కూటమి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలనుకొంటున్నాయి.
పాంచజన్యంలో ఏ పార్టీ ఎక్కడ? ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)
పంజాబ్-హర్యానా రాజధాని చండీగఢ్ మున్సిపాలిటీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో 35 సీట్లకు గానూ అత్యధికంగా 14 స్థానాల్లో ఆప్ గెలుపొందింది. ఈ ఉత్సాహంతోనే వచ్చే పంజాబ్ ఎన్నికల్లోనూ ఎక్కువ సీట్లను గెలుచుకొని అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రాంతాల వారీగా జనబలం ఉన్న నేతలకు టికెట్లు ఇస్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందుగానే 88 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేశారు. సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ బరిలోకి దిగనున్న శ్రీ చామ్కౌర్ సాహిబ్ నియోజకవర్గంలో బలమైన నేతగా పేరున్న చరణ్జిత్ సింగ్ను పోటీలోకి దింపనున్నారు.
సంయుక్త సమాజ్ మోర్చా (ఎస్ఎస్ఎం)
సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగా నిరసనోద్యమాన్ని చేపట్టిన 22 రైతు సంఘాలు కలిసి ఎస్ఎస్ఎంగా ఏర్పడి పంజాబ్ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. రైతు నాయకుడు బల్బీర్సింగ్ రాజేవాలా నేతృత్వంలో ఇప్పటికే ఎన్నికల కార్యాచరణ రూపొందింది. కేంద్రం మెడలు వంచి వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంలో కీలక భూమిక పోషించిన రైతు నేతలు అధికారంలోకి వస్తే తమకు లబ్ధి చేకూరుతుందని పంజాబ్ రైతులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని సిక్కులు, 11 లక్షల రైతు కుటుంబాలు తమకే మద్దతు ప్రకటిస్తాయని ఎస్ఎస్ఎం ధీమాతో ఉన్నది.
కాంగ్రెస్
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ను కుదేలు చేస్తున్నాయి. కీలక నేతలు నవ్జోత్సింగ్ సిద్ధూ, మాజీ సీఎం అమరిందర్సింగ్ మధ్య ఏర్పడిన పొరపొచ్చాలు, అనంతర పరిణామాలు పార్టీ క్యాడర్లో తప్పుడు సంకేతాలను తీసుకెళ్లాయి. దళిత ఓటర్లను ఆకర్షించే ఉద్దేశంతో కొత్త సీఎంగా చన్నీని తీసుకొచ్చినప్పటికీ, పార్టీలో విభేదాలు సమసిపోలేదు. దీనికి తోడు ఇతర పార్టీలకు వలసలు కాంగ్రెస్కు తలనొప్పిగా మారాయి. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ పెట్టిన మాజీ సీఎం అమరిందర్ కాంగ్రెస్ ఓట్లను చీల్చే అవకాశముంది.
బీజేపీ కూటమి
బీజేపీ-పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ)-శిరోమణి ఆకాలీదళ్ సంయుక్త్ (ఎస్ఏడీఎస్) ఈ కూటమిలో భాగంగా ఉన్నాయి. సాగుచట్టాలపై వ్యవహరించిన తీరు ఈ ఎన్నికల్లో బీజేపీకి చిక్కులు తీసుకువచ్చేలా ఉన్నది. చట్టాలను వెనక్కి తీసుకొంటున్నట్టు ప్రకటించినప్పటికీ, ఆ పార్టీపై రైతులతో పాటు పంజాబ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. లఖింపూర్ ఖీరీ రైతుల హత్య వ్యవహారంలో కేంద్రమంత్రి అజయ్మిశ్రాపై ఉదాసీనంగా వ్యవహరించడం, మరణించిన రైతుల పరిహారంపై మీనమేషాలు లెక్కించడం కాషాయ పార్టీకి అవరోధాలుగా మారనున్నాయి.
ఎస్ఏడీ కూటమి
శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)-బహుజన్ సమాజ్పార్టీ (బీఎస్పీ) ఈ కూటమిలో భాగంగా ఉన్నాయి. 2012-17లో అధికారంలో ఉన్న ఎస్ఏడీ.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగింది. అయితే, ఈ కూటమికి అత్యల్పంగా 18 సీట్లే వచ్చాయి. అయితే, సాగుచట్టాలపై బీజేపీ వైఖరిని నిరసిస్తూ కూటమి నుంచి బయటికొచ్చిన ఎస్ఏడీ.. తాజాగా బీఎస్పీతో జట్టు కట్టింది. ఇటీవలి చండీగఢ్ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటునే గెలిచిన ఎస్ఏడీ.. కీలక నేతల వలసలతో రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలో 62 శాతం ఉన్న దళితులు, వెనుకబడిన వర్గాల ఓటర్లను ఆకర్షించాలని బీఎస్పీతో జట్టు కట్టినప్పటికీ ఎస్ఏడీ ప్రచారంలో వెనుకబడింది.