భోపాల్: ఏనుగులను తరిమికొట్టేందుకు తేనెటీగల పెట్టెలు వినియోగించాలని ప్రజలకు ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని సరిహద్దు జిల్లా ప్రాంతాల్లో ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లోని ఏనుగులు మధ్యప్రదేశ్ సరిహద్దు జిల్లా ప్రాంతాల్లోకి వస్తున్నాయి. పంటలను నాశనం చేయడంతోపాటు మనుషులపై దాడి చేస్తున్నాయి. గత ఏడాది ఏనుగుల దాడుల్లో సుమారు 8 మంది మరణించారు.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. సరిహద్దు జిల్లా ప్రాంతాల్లోకి ప్రవేశించి పంటలను నాశనం చేసే ఏనుగులను వినూత్న పద్ధతుల్లో తరిమికొట్టాలని నిర్ణయించింది. దీని కోసం ఆ ప్రాంతాల ప్రజలకు తేనెటీగల పెట్టెలను పంపిణీ చేస్తున్నది. ఏనుగులను తరిమికొట్టడానికి ప్రభావిత ప్రాంతాల్లో తేనెటీగ పెట్టెలను ఏర్పాటు చేయాలని ప్రజలకు సూచిస్తున్నది. దీని వల్ల తేనెటీగల పెంపకాన్ని కూడా ప్రోత్సహించినట్లుగా ఉంటుందని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.
మరోవైపు ఏనుగులకు ఎలాంటి హానీ తలపెట్టకుండా వాటిని అడవుల్లోకి తరిమే పద్ధతులపై సరిహద్దు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని ఎన్జీవో సంస్థలను కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు గత వారం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఏనుగులను తరిమికొట్టేందుకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న మార్గదర్శకాలను అందులో పేర్కొంది.