ముంబై: కుటుంబంతో టచ్తో ఉండేందుకు జైలులో ఉన్న ఖైదీలకు స్మార్ట్ కార్డులు అందజేశారు. దీని ద్వారా వారంలో మూడుసార్లు కుటుంబ సభ్యులు, లాయర్లతో ఉచితంగా మాట్లాడుకోవచ్చు. (Smart Cards To Inmates) మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఈ సంఘటన జరిగింది. హర్సుల్ సెంట్రల్ జైలులోని సుమారు 650 మంది ఖైదీలకు స్మార్ట్ కార్డులను జైలు అధికారులు అందజేశారు. ఈ కార్డుల ద్వారా వారంలో మూడుసార్లు ఆరు నిమిషాల చొప్పున కుటుంబ సభ్యులు లేదా న్యాయవాదులతో ఉచితంగా మాట్లాడుకోవచ్చని తెలిపారు.
కాగా, ఆర్థిక పరిస్థితుల వల్ల ఖైదీలను కలుకునేందుకు చాలా మంది కుటుంబ సభ్యులు జైలుకు రాలేకపోతున్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదులతో మాట్లాడుకునేందుకు 650 మంది ఖైదీలకు స్మార్ట్ కార్డులు అందించినట్లు చెప్పారు. ఖైదీలతో పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారి కోసం జైలు ఆవరణలో కాలింగ్ బూత్ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ముందుగా అందజేసిన ఫోన్ నంబర్లకు మాత్రమే ఖైదీలు కాల్ చేసే అవకాశం ఉందా? లేక ఏ ఫోన్ నంబర్కైనా కాల్ చేసుకోవచ్చా? అన్నది జైలు అధికారులు స్పష్టం చేయలేదు.