Accident @ UP | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బైక్ రైడర్ను రక్షించే ప్రయత్నంలో అదుపుతప్పిన ట్రక్కు.. అక్కడే ఉన్న వక్తులపైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల సమాచారం ప్రకారం, లఖింపూర్ ఖేరీలోని సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాంగి ఖుర్ద్ గ్రామ సమీపంలో శనివారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న ఒక బైకును తప్పించేందుకు ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని మరోవైపునకు తిప్పారు. అయితే, స్టీరింగ్ ఫెయిల్యూర్ కారణంగా వేగంగా అక్కడే ఉన్న జనంపైకి దూసుకెళ్లింది. రోడ్డు మీద జనం కనిపించకపోవడం వల్లనే ట్రక్కు డ్రైవర్ ఈ పొరపాటు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం సమాచారం అందగానే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిని లఖింపూర్ ఖేరీకి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ ఖేరీ గణేష్ ప్రసాద్ సాహా మీడియాకు తెలిపారు.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా మేజిస్ట్రేట్ మహేంద్ర బహదూర్ సింగ్ను ఆదేశించారు. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అత్యవసర సేవల వైద్యాధికారి తెలిపారు. వారిని లక్నోకు రెఫర్ చేశారు.