జైపూర్: బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన తెలిపేందుకు అసెంబ్లీకి ఆవును తెచ్చారు. అయితే అది ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోయింది. తాడు పట్టుకుని ఉన్న వ్యక్తిని కూడా లాక్కొనిపోయింది. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలోని పశువులకు లంపీ చర్మ వ్యాధి సోకుతున్నది. పశుసంవర్థక శాఖ గణాంకాల ప్రకారం సోమవారం నాటికి ఈ వ్యాధి వల్ల సుమారు 60 వేల పశువులు మరణించాయి. 1.3 లక్షల పశువులు ప్రభావితమయ్యాయి. దీంతో పశువుల పెంపకం దారులు తీవ్రంగా నష్టపోవడంతోపాటు ఈ వ్యాధి పట్ల బెంబేలెత్తుతున్నారు.
ఈ నేపథ్యంలో లంపీ వ్యాధి గురించి రాజస్థాన్లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యే సురేష్ సింగ్ రావత్ ప్రయత్నించారు. ఇందులో భాగంగా వినూత్నంగా నిరసన తెలిపేందుకు సోమవారం ఒక ఆవుతోపాటు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ గేటు బయట మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిద్రపోతున్నదని విమర్శించారు. లంపీ వ్యాధి గురించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు అసెంబ్లీకి ఆవును తెచ్చినట్లు చెప్పారు.
అయితే బీజేపీ ఎమ్మెల్యే సురేష్ సింగ్ రావత్ మీడియాతో మాట్లాడుతుండగా ఆయన తెచ్చిన ఆవు ఝలక్ ఇచ్చింది. ఒక్కసారిగా అది అక్కడి నుంచి వెనక్కి పరుగుతీసింది. ఆవును తాడుతో పట్టుకున్న వ్యక్తిని కూడా లాక్కుపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను సురేష్ సింగ్ రావత్ తిప్పికొట్టారు. ఆవు కూడా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉందంటూ ట్వీట్ చేశారు.
What happened when Bjp mla from Pushkar reached Rajasthan assembly with a cow🤣🤣🤣 pic.twitter.com/I7UHaxjqQ6
— Surbhi✨ (@SurrbhiM) September 20, 2022