లక్నో: తన భర్తను చంపిన వారికి రూ.50,000 రివార్డు ఇస్తానని భార్య ప్రకటించింది. ఈ మేరకు వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆ మహిళ భర్త దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Wife Announces Reward To Kill Husband) ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో బాహ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాకు చెందిన మహిళతో 2022 జూలైలో వివాహం జరిగింది. అయితే పెళ్లి నాటి నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో ఆ ఏడాది డిసెంబర్లో ఆ మహిళ తన పుట్టింటికి వెళ్లింది. నాటి నుంచి అక్కడే ఉంటున్నది. అలాగే భర్త నుంచి నిర్వహణ ఖర్చులు కోరుతూ కేసు వేసింది.
కాగా, గత ఏడాది డిసెంబర్ 21న ఆ వ్యక్తి తన భార్య కోసం అత్తవారింటికి వెళ్లాడు. అయితే తనను చంపుతామని వారు బెదిరించారని భర్త ఆరోపించాడు. అనంతరం తనను హత్య చేసిన వారికి రూ.50,000 రివార్డు ఇస్తానని వాట్సాప్ స్టేటస్లో భార్య పోస్ట్ చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ప్రియుడు కూడా తనను చంపుతానని ఫోన్లో బెదిరించినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాహ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ శ్యామ్ సింగ్ తెలిపారు.