అహ్మదాబాద్: గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సోమనాథ్ ఆలయం (Somnath temple) వెనుక ఉన్న భూమిలో ఆక్రమణల తొలగింపును అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 21 ఇండ్లతోపాటు 150కుపైగా గుడిసెలను నేలమట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ ఆలయానికి చెందిన ట్రస్ట్, గుజరాత్ ప్రభుత్వానికి చెందిన 3 హెక్టార్ల భూమి (7.4 ఎకరాలు) ఆక్రమణలకు గురైంది. 21 ఇండ్లతోపాటు సుమారు 153 గుడిసెలను అక్రమంగా నిర్మించారు.
కాగా, సోమనాథ్ ఆలయ భూమిలో ఆక్రమణలు తొలగించేందుకు రెవెన్యూ అధికారులు శనివారం మెగా డ్రైవ్ నిర్వహించారు. పోలీసుల సహకారంతో అక్రమంగా నిర్మించిన ఇండ్లు, గుడిసెలను జేసీబీలతో నేలమట్టం చేశారు. ఈ నెల 25న ఆక్రమణదారులతో సమావేశం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో వారి సామానులు తరలించుకునేందుకు ట్రాక్టర్లను ఏర్పాటు చేయడంతోపాటు ఫుడ్ ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆక్రమణలు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అన్నారు.