శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోకి ఉగ్రవాదుల చొరబాటుకు (Terrorist Infiltration) పాకిస్థాన్ ఆర్మీ సహకరించింది. దీని కోసం సొంత ఆర్మీ పోస్ట్ను దగ్ధం చేసింది. భారత ఆర్మీ ఈ విషయాన్ని వెల్లడించింది. శుక్రవారం రాత్రి జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు ద్వారా భారత్లోకి చొరబడేందుకు నలుగురు ఉగ్రవాదులు ప్రయత్నించారు. దీనికి పాకిస్థాన్ ఆర్మీ సహాయం చేసింది. భారత్ వైపు ఉన్న నిఘా పరికరాల దృష్టిని మరల్చేందుకు సైనిక పోస్టుల్లో ఒక దానికి నిప్పుపెట్టింది. అయితే ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత ఆర్మీ భగ్నం చేసింది. జవాన్ల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరో ఇద్దరు పాకిస్థాన్ వైపు పారిపోయారు.
కాగా, ఇండియన్ ఆర్మీ 16 కార్ప్స్ ఈ విషయాన్ని నిర్ధారించింది. ఇండో, పాక్ సరిహద్దులోని అఖ్నూర్ సెక్టార్లో శుక్రవారం రాత్రి నలుగురు ఉగ్రవాదుల కదలికలను నిఘా పరికరాల ద్వారా గమనించినట్లు తెలిపింది. కాల్పులు జరుపడంతో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని, ఒకరి మృతదేహాన్ని వెనక్కి లాగడం కనిపించినట్లు ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా భారత ఆర్మీ దృష్టిని మళ్లించేందుకు పాకిస్థాన్ ఆర్మీ ప్రయత్నించిందని, దీని కోసం సొంత సైనిక పోస్ట్ను తగులబెట్టినట్లు పేర్కొంది. ఇటీవల కాలంలో నియంత్రణ రేఖతో పాటు, అంతర్జాతీయ సరిహద్దులో కూడా ఉగ్రవాదుల చొరబాట్లను పాకిస్థాన్ ఆర్మీ ప్రేరేపిస్తున్నట్లు భారత ఆర్మీ ఆరోపించింది.