చెన్నై: కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు ఔషధాల మిశ్రమంతో ఆవిరి పట్టడం మంచిదేనని, అయితే అందుకు బహిరంగ ప్రదేశాలు అనువైనవి కావని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణ్యం హెచ్చరించారు. వైద్యుల సలహాలు తీసుకోకుండా బహరింగ ప్రదేశాలు ఆవిరి పట్టకూడదని ఆయన సూచించారు. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్యమంత్రి ఒక ప్రకటన చేశారు.
తమిళనాడులో ప్రస్తుతం కరోనా తీవ్రరూపం దాల్చుతుండడంతో రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వంటి బహిరంగ ప్రాంతాల్లో ఆవిరి పట్టేందుకు సౌకర్యం కల్పించారు. పసుపు, కర్పూరం, వేపాకు, తులసి మిశ్రమాన్ని ప్రజలు యంత్రాల ద్వారా ఆవిరి రూపంలో పీల్చుకుంటున్నారు. దీనిపై స్పందించిన మంత్రి సుబ్రమణ్యం.. వైద్యుల సలహా తీసుకోకుండా అలాంటి సౌకర్యాలను వినియోగించుకోవద్దన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాల ద్వారా ఆవిరి పట్టడంవల్ల ఊపిరితిత్తుల్లో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. చెన్నై, తిరుచ్చి, ఈరోడ్, కోయంబత్తూర్ ప్రాంతాల్లో ఆదివారం నుంచి ప్రజలు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు తదితర బహిరంగ ప్రాంతాల్లో మూలికల మిశ్రమంతో ఆవిరి పడుతున్నారని, దానివల్ల ఊపిరితిత్తులకు ప్రమాదం పొంచి ఉన్నందున అలాంటి వాటికి దూరంగా ఉండాలని మంత్రి సూచించారు.