Dhananjay Munde – Ajit Pawar | మహారాష్ట్రలోని బారామతి లోక్ సభా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ స్థానం నుంచి శరద్ పవార్ కూతురు, సిట్టింగ్ ఎంపీ సుప్రియాసూలే నాలుగోసారి పోటీ చేస్తుండగా, ప్రత్యర్థిగా ఎన్డీఏ తరుపున మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో ఉన్నారు. సునేత్ర పవార్ ‘ఔట్ సైడర్’ అని శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అజిత్ పవార్కు అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే ఓ వార్తా చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవార్ కుటుంబానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘పవార్ కుటుంబంలో అజిత్ పవార్ ఒంటరయ్యారు. దీనికి శరద్ పవార్ నిర్వహించిన సమావేశమే కారణం. ఇప్పుడు అందరి దృష్టంతా బారామతిపైనే ఉంది. పవార్ కుటుంబ సభ్యులంతా ఒకవైపు ఉంటే, అజిత్ పవార్ మరొకవైపు ఉన్నారు. బారామతిలో అజిత్ పవార్ చేపట్టిన అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి తెలుసు. కేవలం సానుభూతి ఓట్లపైనే ఆధారపడి ప్రచారం చేస్తున్న సుప్రియా సూలేకు ఎన్నికల ఫలితాల రోజు వాస్తవ పరిస్థితి అవగతం అవుతుంది’ అని అన్నారు.
‘ఇక పంకజ్ ముండే పోటీ చేస్తున్న బీడ్ లోక్ సభా నియోజకవర్గ పరిధిలో ఉద్దేశ పూర్వకంగా కుల విభేదాలు తెచ్చినా, మత విద్వేషాలు రగిల్చినా ఎటువంటి మార్పు లేదు. బీడ్ స్థానంలో పంకజా ముండే విజయం సాధిస్తారు’ అని ధనంజయ్ ముండే చెప్పారు.