Supreme court : ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పూర్తవగానే ఐదేళ్లకు బదులుగా నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్ఎల్బీ) చదివేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇంటర్ తర్వాత మూడేళ్ల కోర్సు కరెక్టు కాదని, ప్రస్తుత కోర్సు విధానం సరిగ్గానే ఉందని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
కాగా, ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసినవారు మాత్రమే నేరుగా మూడేళ్ల లా కోర్సులో చేరేందుకు అవకాశం ఉంది. ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైనవారు లా చదవాలంటే ఐదేళ్ల కోర్సులో చేరాల్సి ఉంటుంది. అయితే, ఇంటర్ తర్వాత నేరుగా మూడేళ్ల కోర్సులో చేరడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని నియమించేలా కేంద్రం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు.
మేధావులైన విద్యార్థులు మూడేళ్లలోనే న్యాయవాద కోర్సును పూర్తి చేయగలరని, ప్రస్తుత విధానం వల్ల అయిదేళ్ల కోర్సుతో వారికి సమయం వృథా అవుతుందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనివల్ల పేదలు, ముఖ్యంగా అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘మూడేళ్లు కూడా ఎందుకు..? హైస్కూల్ పూర్తవగానే నేరుగా లా ప్రాక్టీస్ మొదలు పెట్టేయండి’ అని వ్యాఖ్యానించింది.
పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వాస్తవానికి న్యాయవిద్యకు ఐదేళ్ల కోర్సు కూడా తక్కువే. అయితే ప్రస్తుత విధానం సరిగ్గానే పనిచేస్తోంది. దీనిపై ఆలోచించడానికి ఏం లేదు. ఇక ప్రస్తుతం జిల్లాస్థాయి న్యాయవ్యవస్థల్లో 70 శాతం మంది మహిళలు ఉన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది ఇందులో చేరుతారు’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. పిటిషన్ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్ను ఆదేశించింది.