చెన్నై: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్విట్టర్ ద్వారా రోశయ్య మృతికి సంతాపం తెలిపారు. రోశయ్య మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని గవర్నర్ రవి పేర్కొన్నారు. ఆయన గొప్ప రాజకీయ నాయకుడని, సుదీర్ఘ కాలం చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారని కొనియాడారు. రోశయ్య మరణం దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని లోటు అని ట్వీట్ చేశారు.
రోశయ్య ఆత్మకు శాంతి కలుగాలని గవర్నర్ రవి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోశయ్య మరణవార్త వినగానే తనకు చాలా బాధ కలిగిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు. రోశయ్య మంచి అనుభవశాలి అయిన నాయకుడని, మేధావి అని స్టాలిన్ కొనియాడారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.