న్యూఢిల్లీ, చెన్నై, నవంబర్ 9: తమిళనాడులో గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరింది. గవర్నర్ ఆర్ఎన్ రవి రాజ్యాంగబద్ధంగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారని, ఆయన్ను వెంటనే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వినతిపత్రం సమర్పించినట్టు అధికార డీఎంకే మంగళవారం వెల్లడించింది. రాష్ట్రపతికి ఇచ్చిన మెమోరాండంలో గవర్నర్పై డీఎంకే తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేసింది. తన ప్రసంగాల ద్వారా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించింది. రాజ్యాంగాన్ని, చట్టాలను పరిరక్షిస్తానని ఆయన చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారని అందులో పేర్కొన్నది. ఈ మోమెరాండంపై అధికార డీఎంకే నేతృత్వంలోని ఎస్పీఏ కూటమి ఎంపీలు సంతకాలు చేశారు.
బిల్లులు ఆమోదించకుండా..
అసెంబ్లీ నుంచి పంపిన బిల్లును ఆమోదించకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి తీవ్ర అలసత్వం వహిస్తున్నారని పేర్కొంటూ పెండింగ్లో ఉన్న 20 బిల్లులను డీఎంకే తన వినతి పత్రంలో పొందుపర్చింది. అందులో నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు, యూనివర్సిటీల వైస్చాన్స్లర్ల నియామకానికి సంబంధించినవి ఉన్నాయి. శాసనసభ లేదా క్యాబినెట్ నిర్ణయాలను నియంత్రించేలా గవర్నర్కు విశిష్ట అధికారాలేమీ లేవని, అసెంబ్లీ ఆమోదించిన నీట్ బిల్లును రాష్ట్రపతికి పంపకుండా, తిప్పిపంపడం ద్వారా రాష్ట్రపతి అధికారాలను లాక్కున్నారని మెమోరాండంలో తెలిపింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను అడ్డుకొనే నిరంకుశ పరిస్థితులు తమిళనాడులో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా గవర్నర్ రవి బహిరంగంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఆయన ఇటీవలి పలు ప్రసంగాలను కూడా డీఎంకే తన మెమోరాండంలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆర్ఎన్ రవి రాజ్యాంగబద్ధ పదవికి అనర్హుడని, వెంటనే తొలగించాలని కోరింది.