కోయంబత్తూర్, మే 30: తమ మూడున్నరేండ్ల కుమార్తెకు ఏ కులం, మతంతో సంబంధం లేదని పేర్కొంటూ ‘నో క్యాస్ట్, నో రిలీజియన్’ సర్టిఫికెట్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన నరేష్ కార్తిక్, గాయత్రి దంపతులు. ఈ సర్టిఫికెట్ తీసుకుంటే రిజర్వేషన్లు, ఇతర ప్రభుత్వ సదుపాయాలు అందవని తెలిసినప్పటికీ, తమ బిడ్డకు ప్రేమ, సమానత్వం నేర్పించాలని భావించి కుల ధ్రువీకరణ పత్రం పొందేందుకు ఇష్టపడలేదు.
తమ బిడ్డను బడిలో చేర్చించేందుకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ అడగని పాఠశాల కోసం వెతికారు. జిల్లా కలెక్టర్ జీఎస్ సమీరన్ను కూడా కలిశారు. ఆయన సూచనలతో నార్త్ కోయంబత్తూరు తహశీల్దార్ను కలవగా, తల్లిదండ్రుల నుంచి అఫిడవిట్ తీసుకొని ‘నో క్యాస్ట్, నో రిలీజియన్’ సర్టిఫికెట్ జారీచేశారు. చాలా మందికి ఈ సర్టిఫికెట్ గురించి తెలియదని నరేష్ కార్తిక్ పేర్కొన్నారు.