చెన్నై, సెప్టెంబర్ 23: మదురై ఎయిమ్స్ నిర్మాణం 95 శాతం పూర్తయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ప్రకటనను తమిళనాడుకు చెందిన సీపీఎం, కాంగ్రెస్ ఎంపీలు తప్పపట్టారు. మదురైలోని తొప్పూరులో ఎయిమ్స్ కోసం కేటాయించిన విశాలమైన స్థలం బోసిగానే ఉందని విరుదునగర్ కాంగ్రెస్ ఎంపీ మానిక్కం ఠాకూర్, మదురై సీపీఎం ఎంపీ ఎస్ వెంకటేషన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
95 శాతం కాదు కదా గంటసేపు వెతికినా ఎక్కడా నిర్మాణం జాడలే కనిపించలేదని వారు దుయ్యబట్టారు. నడ్డా అంటున్న బిల్డింగ్ను ఎవరో ఎత్తుకు పోయి ఉంటారని ఎద్దేవా చేశారు. మదురై ఎయిమ్స్ కోసం తమిళనాడు ప్రజలు ఎదురు చూస్తున్నారని, బీజేపీ తప్పుడు ప్రకటనలతో మోసం చేస్తున్నదని మండిపడ్డారు. రూ.1,977 కోట్ల సవరించిన అంచనాకు క్యాబినెట్ ఇంకా ఆమోదం తెలుపనే లేదని, నడ్డా మాత్రం 95% పనులు పూర్తయ్యాయని కోతలు కోస్తున్నారని మండిపడ్డారు.