కోల్కతా : కాషాయ పార్టీ గూండాయిజం ఐటీ కమిటీ రూంల నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ (ఏటీసీ)ల్లోకి చొరబడిందని టీఎంసీ ఎంపీ మహువ మొయిత్ర అన్నారు. ఎయిర్పోర్ట్ల్లోని ఏటీసీల్లోకి ఆ పార్టీ నేతలు చొచ్చుకువెళ్లడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు.
జార్ఖండ్లోని దియోఘఢ్ ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటనను ఉద్దేశించి ఆమె వరుస ట్వీట్లలో కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.చార్టర్డ్ విమానాలను వాడుతూ విపక్షాల రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూల్చుతుందని తనకు తెలుసని, ఇప్పుడు ఆ జాబితాలో ఏటీసీ కంట్రోల్ రూమ్లు కూడా చేరాయా అంటూ టీఎంసీ ఎంపీ ప్రశ్నించారు.
కాగా, జార్ఖండ్లోని దియోఘఢ్ ఎయిర్పోర్ట్లో నిబంధనలకు విరుద్ధంగా తమ చార్టర్డ్ విమానం టేకాఫ్కు అనుమతించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీపై కేసు నమోదైంది. ఎయరి్పోర్ట్ డీఎస్పీ సుమన్ అనన్ ఫిర్యాదు ఆధారంగా బీజేపీ నేతలపై కేసు నమోదైంది. ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడంతో పాటు నిబంధనలను అతిక్రమించినందుకు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.