కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తను ప్రత్యర్థులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది. బసంతిలోని భరత్పూర్ ప్రాంతంలో టీఎంసీ కార్యకర్త జలే ఆలం ఘాజీని దుండగులు కత్తితో పొడిచారు. ఛాతిపై తీవ్ర గాయం కావడంతో రక్తం ధారగా కారి అతడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే టీఎంసీ కార్యకర్త జలే ఆలం ఘాజీని ప్రత్యర్థులు హత్య చేయడానికి కారణం ఏమిటన్నది ప్రస్తుతం నిర్ధారణ కాలేదని అన్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, పశ్చిమ బెంగాల్లో అధికారం కోసం తెగ ప్రయత్నించిన బీజేపీ, ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు అల్లర్లకు ఉసిగొల్పింది. దీంతో దాడులు, ప్రతి దాడులతో బెంగాల్ దద్దరిల్లింది. అయితే సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచింది. ఫలితాల ప్రకటన తర్వాత కూడా అల్లర్లు, దాడులు జరిగాయి. నాటి నుంచి రాజకీయ దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి.