‘నల్లగొండ జిల్లాలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం. సరిహద్దుల్లో ప్రధాన రహదారులపై ఐదు చెక్పోస్టులతో పర్యవేక్షణ కొనసాగుతున్నది. పట్టణాల్లో తనిఖీలు ముమ్మరం చేశాం. అనవసరం బయటకు వచ్చిన వారిపై నిత్యం సగటున 250వరకు వాహనాల సీజ్, 600 వరకు ఈ-పిటీ, ఈ-చలాన్ల ద్వారా జరిమానాలు విధిస్తున్నాం. గల్లీల్లో తెరిచి ఉంచిన దుకాణాలపైనా 25నుంచి 30కేసులు నమోదు చేస్తున్నాం. 19రోజుల లాక్డౌన్లో పెద్ద ఎత్తున కేసుల నమోదుతోపాటు జరిమానాలు విధించాం. ఫలితంగా మెజార్టీ ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో కరోనా కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రారంభంలో 30శాతం ఉన్న పాజిటివ్ రేషియో 16శాతానికి పడిపోవడం మంచి పరిణామమే. దీన్ని ఇంకా కట్టడి చేయాల్సి ఉంది.’ అని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
నమస్తే : జూన్ 10 వరకు లాక్డౌన్ పొడిగించారు. అమలు ఎలా ఉండనుంది?
ఎస్పీ : లాక్డౌన్ను మరో 10రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మధ్యాహ్నం 2గంటల నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమలుకానుంది. ఈ సమయంలో ఎవరైన అనవసరంగా బయటకు వస్తే మరింత కఠినంగా వ్యవహరిస్తాం. గల్లీల్లో సైతం నిఘాను మరింత పెంచుతాం. టైంపాస్కు బయటకు వస్తే జరిమానాలతోపాటు వారిని డీటీసీలోని పోలీసు ఐసొలేషన్ కేంద్రానికి తరలిస్తాం. అక్కడే ఒకటిరెండు రోజులు ఉంచుతాం. వాహనాలను సైతం సీజ్ చేసి కోర్టుకు పంపిస్తాం. గల్లీల్లో దుకాణాలు తెరిస్తే షాపులు సీజ్ చేసి కేసులు పెడతాం. డ్రోన్ కెమెరాలతోనూ పర్యవేక్షణ కొనసాగుతుంది. సరిహద్దుల్లోనూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. ఈ పాసులుంటేనే ప్రయాణాలకు అనుమతిస్తాం. ఎవరినీ ఉపేక్షించం.
నమస్తే : ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజులు కట్టడి అయినట్లేనా? నిఘా ఎలా ఉంది?
ఎస్పీ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫీజుల అమలుపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఆస్పత్రుల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో ఫీజుల నిర్ధారణ జరిగింది. అందుకు అనుగుణంగా ఫీజుల పట్టికను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నాం. ఈ విషయంలో అన్ని జిల్లాల కంటే ముందున్నాం. ఇప్పటికీ ఆస్పత్రుల వారు అధిక ఫీజులు డిమాండ్ చేస్తే ప్రజలు నేరుగా డయల్ 100కు గానీ లేదంటే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇలా ఏ రూపంలోనైనా ఫిర్యాదు చేయవచ్చు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల దందాకు అడ్డుకట్ట వేశాం. జిల్లాలో రెండు ఆస్పత్రులపై కేసులు నమోదు చేసి ఆరెస్టులు కూడా చేశాం. మరో రెండు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశాం. మరో రెండు దవాఖానలపై విచారణ కొనసాగుతుంది.
నమస్తే : లాక్డౌన్లో జిల్లాలో పోలీసుశాఖ తరుఫున ప్రత్యేకంగా చేస్తున్న కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా?
ఎస్పీ : జిల్లాలో పోలీసు శాఖ కూడా ఆపదలో ఉన్న ప్రజల కోసం పలు కార్యక్రమాలు చేపట్టింది. వివిధ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో గ్రామాల్లో ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తున్నాం. పానగల్, అప్పాజిపేటల్లో ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. వారం రోజులుగా జిల్లాలోని ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో యువతతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టాం. ప్రతి మండలంలో అత్యధిక పాజిటివ్ కేసులున్న ఒక గ్రామాన్ని ఇప్పటికే గుర్తించాం. అక్కడ నేటి నుంచి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తాం. గ్రామ సర్పంచ్, స్థానికులు, ప్రత్యేకంగా యువత, ఆర్ఎంపీలను భాగస్వాములను చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తాం. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పోలీసుల కృషి కొనసాగుతుంది.
నమస్తే : సడలింపు సమయం పెరిగిన నేపథ్యంలో చర్యలు ఎలా ఉండబోతున్నాయి?
ఎస్పీ : సడలింపు సమయం అదనంగా మరో మూడుగంటల పాటు పెరిగింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ సమయంలో కొవిడ్ నిబంధనలపై మరింత దృష్టి పెడతాం. ప్రజలు ఒకేచోట గుమికూడే అవకాశాలున్న కూరగాయలు, చేపల మార్కెట్లను హాట్స్పాట్లుగా గుర్తించి విశాల ప్రదేశాలకు తరలించాం. ఇంకా ఇలాంటివి ఉంటే చర్యలు తీసుకుంటాం. ఇక మాస్క్ల ధరింపు, భౌతికదూరం పాటింపు లాంటి విషయం కఠినంగా వ్యవహరిస్తాం.
నమస్తే : లాక్డౌన్ సందర్భంగా ప్రజలకు మీరిచ్చే సందేశం?
ఎస్పీ : ప్రభుత్వం ఆర్థికంగా నష్టాలను భరిస్తూ కూడా లాక్డౌన్ అమలు చేస్తుంది. అంటే ప్రజలను కొవిడ్ బారి నుంచి గట్టెక్కించడమే ప్రభుత్వం లక్ష్యం. అందులో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై సహకరిస్తేనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ప్రతి ఒక్కరూ మనల్ని మనం కాపాడుకునేందుకు స్వీయ నియంత్రణ పాటిస్తూనే సామాజిక బాధ్యతతోనూ వ్యవహరించాలి.