కోల్కతా : టీచర్స్ రిక్రూట్మెంట్ స్మామ్లో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్ధ ఛటర్జీ ఉదంతంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలను టీఎంసీ ఆదేశించింది. తన ఫ్లాట్లో స్వాధీనం చేసుకున్న నగదు అంతా పార్ధా ఛటర్జీదేనని ఈడీ అదుపులో ఉన్న పార్ధా ఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ వెల్లడించిన క్రమంలో టీఎంసీ నాయకత్వం పార్టీ శ్రేణులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.
మంత్రి పదవితో పాటు పార్టీలోని అన్ని పదవుల నుంచి పార్ధా ఛటర్జీని తొలగించాలని పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్ పెరుగుతున్న క్రమంలో గురువారం సాయంత్రం 5 గంటలకు అత్యవసర భేటీకి టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ పిలుపు ఇచ్చారు.
పార్ధా ఛటర్జీని మంత్రివర్గం నుంచి తొలగించే విషయంలో సీఎం మమతా బెనర్జీ ఓ నిర్ణయం తీసుకోనుండగా, పార్టీ పదవుల నుంచి ఆయనను తొలగించేందుకు టీఎంసీ అగ్ర నాయకత్వం సిద్ధమైనట్టు సమాచారం. పార్ధా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ పదవుల నుంచీ ఆయనను తప్పించాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి, ప్రతనిధి కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు.