కోల్కతా : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు (Bengal Polls) నామినేషన్ల పర్వం ఊపందుకోవడంతో రోజూ వేలాది నామినేషన్లు దాఖలవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాలక టీఎంసీ శ్రేణులు ప్రత్యర్ధి పార్టీలపై దౌర్జన్యాలకు పాల్పడుతూ హింసకు తెగబడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విపక్ష నేతల ఆరోపణల నేపధ్యంలో టీఆఎంసీ నేతలు సలాన్పూర్, తూర్పు వర్ధమాన్ జిల్లాల్లో బీజేపీ, సీపీఎం నేతలు, ఆయా పార్టీల అభ్యర్ధులకు వాటర్ బాటిల్స్తో పాటు రోజా పూలు అందించారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఆకాంక్షిస్తూ పాలక టీఎంసీ నేతలు పలు చోట్ల విపక్ష నేతలకు టీ, బిస్కెట్లను కూడా ఆఫర్ చేశారు. తమ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి హింస చోటుచేసుకోలేదని ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని అభ్యర్ధులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నామినేషన్లు సమర్పించాలని తాము కోరుకుంటున్నామని టీఎంసీ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ భోలా సింగ్ పేర్కొన్నారు. విపక్షాలను నామినేషన్లు వేయనీయకుండా టీఎంసీ శ్రేణులు అడ్డుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయని, అయితే ఈ ప్రాంతంలో అలాంటి పరిస్ధితి లేదని సింగ్ చెప్పుకొచ్చారు.
ప్రజల వికాసానికి పాటుపడే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలని తాము కోరుకుంటున్నామని, సుహృద్భావ వాతావరణంలో పోలింగ్ జరిగేలా తాము సహకరిస్తామని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో జులై 8న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో తొలిరోజు హింసాకాండ చెలరేగింది. పలు చోట్ల అల్లర్లు చెలరేగడంతో పలువురు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు.
Read More