కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం (Teachers’ recruitment scam) కేసులో మరో ప్రజాప్రతినిధి అరెస్ట్ అయ్యారు. టీచర్ రిక్రూట్మెంట్ స్కాంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార టీఎంసీ (TMC) ఎమ్మెల్యే జీబన్ కృష్ణ సాహాను (Jiban Krishna Saha) కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) అదుపులోకి తీసుకున్నది. ముర్షిదాబాద్ జిల్లాలోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు.. కోల్కతాలకు తరలించారు.
బుర్వాన్ ఎమ్మెల్యే అయిన సాహాను సీబీఐ అధికారులు ఈ నెల 14 నుంచి విచారిస్తున్నారు. 65 గంటలపాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయినప్పటికీ విచారణకు సహకరించకపోవడంతో సాహాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన టీఎంసీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే పార్థా చటర్జీ (Partha Chatterjee), మాణిక్ భట్టాచార్యను (Manik Bhattacharya) సీబీఐ అరెస్టు చేసింది. కాగా, సాహా ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించడంతో.. ఆయన తనకు చెందిన రెండు ఫోన్లను సమీపంలోని చెరువులో పడేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.