కోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ లీడర్, కుచ్బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ రవీంద్రనాథ్ ఘోష్ తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. బిర్యానీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వల్ల పురుషుల్లో శృంగార కోరికలు తగ్గుతున్నాయని ఘోష్ పేర్కొన్నారు. ఈ కారణంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఓ బిర్యానీ షాపును మూసివేయించారు. ప్రస్తుతం ఇది వివాదాస్పదంగా మారింది.
ఈ సందర్భంగా ఘోష్ మాట్లాడుతూ.. కుచ్బెహార్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా షాపులు నిర్వహిస్తున్నారు. కోల్కతా బిర్యానీ షాపులకు పోటీగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి షాపులను నిర్వహిస్తున్నారు. వారు చేసే బిర్యానీలను తినడం వల్ల శృంగార సామర్థ్యం తగ్గుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎలాంటి లైసెన్సులు లేకుండానే బిర్యానీ షాపులను నిర్వహిస్తున్నారని, అలాంటి షాపులను మూసివేయిస్తున్నామని ఘోష్ పేర్కొన్నారు.
ఈ అంశంపై బెంగాల్కు చెందిన మాజీ మంత్రి స్పందించారు. మసాలా దినుసుల వల్ల లైంగిక పటుత్వం తగ్గుతుందనడానికి ఆధారాలు లేకపోయినప్పటికీ, వివిధ వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా బిర్యానీ షాపులను మూసివేయించాల్సి వచ్చిందన్నారు.