కోల్కతా : వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ యోచిస్తోందని, ఈ మేరకు ప్లాన్ను సైతం సిద్ధం చేసిందని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ ఆరోపించారు. తరచుగా రాష్ట్ర చట్టంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సీబీఐ, ఇతర ఏజెన్సీలను వినియోగించుకోవడంతో పాటు గవర్నర్ను కేంద్రం బీజేపీ పార్టీకి ఏజెంట్గా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి ఇటీవల ఉత్తర బెంగాల్లో పర్యటించగా.. ఆయన స్పందిస్తూ కేంద్రం ప్రభుత్వం దేశాన్ని అంతర్గతంగా విభజించి, రాష్ట్రం నుంచి ఉత్తర బెంగాల్ను విడతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అలా చేయలేకపోతే వారు ఎన్నికల్లో గెలువలేరని, లేకుంటే పార్టీ ఎమ్మెల్యేలు కేంద్ర హోంమంత్రి సమక్షంలో వేదికపై నుంచి ప్రత్యేక ఉత్తర బెంగాల్ అంశాన్ని ఎలా లేవనెత్తుతారు? అని ప్రశ్నించారు. బెంగాల్లో శాంతిభద్రతలపై నిరంతరం ప్రశ్నించడం, ఆందోళన వ్యక్తం చేయడంతో బీజేపీ రెండో ప్రణాళిక అన్నారు. మూడో వ్యూహంలో భాగంగా 2021 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించిన తర్వాత మంత్రులపై బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తుందని ఆరోపించారు.
లంచం కేసులో బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారికి సీబీఐ సమన్లు జారీ చేయలేదన్నారు. బెంగాల్ గవర్నర్ కార్యాలయాన్ని బీజేపీ వినియోగించుకుంటోందని, ఇది బీజేపీ నాల్గో ప్రణాళిక అన్నారు. బెంగాల్ రాష్ట్రానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేయడంతో పాటు విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. కేంద్రంలోని అధికార పార్టీకి గవర్నర్ ఏజెంట్గా వ్యవహరిస్తూ.. రాష్ట్ర పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. లోక్సభ ఎన్నికలకు ఆరు నెలల ముందు రాష్ట్రపతి పాలన విధించి.. ఎన్నికలను తారుమారు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు రాయ్ ఆరోపించారు.