న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా టీఎంసీ (TMC) నేత కకోలి ఘోష్ దస్తిదార్ బీజేపీపై విరుచుకుపడ్డారు. 16 రాష్ట్రాల్లో కాషాయ పార్టీ అధికారంలో ఉన్న పాలక పార్టీకి ఒక్క రాష్ట్రంలోనూ మహిళా సీఎం లేరని ఆమె ఎద్దేవా చేశారు. బీజేపీ కేంద్రంలో తొమ్మిదేండ్లకు పైగా అధికారంలో ఉన్నా ఇప్పటివరకూ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలన్న ఆలోచన రాకపోవడం శోచనీయమని అన్నారు.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి ఏడాది ఈ దిశగా ప్రయ్నతాలు చేస్తోందని ఆక్షేపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చేందుకు ఇంత కాలం ఎందుకు ఆగారు..? 2014లోనే ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందే ఎందుకు..? దేశ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారని కాషాయ పాలకులను నిలదీశారు.
మహిళా రెజ్లర్లను అవమానించిన వారిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఢిల్లీలో రెజ్లర్ల నిరసనలను ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. బెంగాల్ అసెంబ్లీలో ఇతర రాష్ట్రాల కంటే అత్యధికంగా మహిళలు ఉన్నారని, ఎలాంటి రిజర్వేషన్లు లేకున్నా 2014 నుంచి లోక్సభలో తమ పార్టీ తరపున 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేస్తున్నామని టీఎంసీ ఎంపీ చెప్పుకొచ్చారు.
Read More :
DMK MP Kanimozhi: వందనం వద్దు.. సమానంగా చూడండి : కనిమొళి