అధికార పరిధిని నిర్దేశించిన రాజ్యాంగం..
ఆ హద్దుల్లోనే ప్రభుత్వాంగాల విధులు
ప్రభుత్వాలు చట్టాల ప్రకారం పనిచేస్తే
కోర్టులు.. గవర్నమెంట్ దారికి అడ్డు రావు
ఖాళీల భర్తీతోనే ‘పెండింగ్’ భారం దూరం
కోర్టుల్లో స్థానిక భాషలకు టైం వచ్చింది
సీఎంలు, సీజేల సదస్సులో జస్టిస్ రమణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: రాజ్యాంగం నిర్ణయించిన అధికారాల పరిధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అంగాలు పనిచేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విధి నిర్వహణలో రాజ్యాంగం నిర్దేశించిన ‘లక్ష్మణ రేఖ’ను మరవకూడదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థలు పరస్పరం సామరస్యపూర్వకంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ర్టాల సీఎంలు, హైకోర్టు సీజేల సంయుక్త సదస్సు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఈ సదస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో జస్టిస్ రమణ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు చట్టం ప్రకారం పనిచేసినంత కాలం కోర్టులు జోక్యం చేసుకోవని, ప్రభుత్వాల దారికి అడ్డు రావని పేర్కొన్నారు. కొన్ని ప్రభుత్వాలు కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఇటీవల కోర్టు ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని జస్టిస్ రమణ అసహనం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. శనివారం ప్రారంభమైన సీఎంలు, హైకోర్టు సీజేల సదస్సు 11వది. ఆరేండ్ల తర్వాత దీన్ని మళ్లీ నిర్వహిస్తున్నారు.
ఎన్జేఐఏను ఏర్పాటు చేయాలి
న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను జస్టిస్ రమణ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోర్టులో మౌలిక వసతులను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు నేషనల్ జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ(ఎన్జేఐఏ)ని ప్రారంభించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. కోర్టుల్లో జడ్జిల కొరతను ప్రస్తావించారు. గత ఏడాది కాలంగా నియామకాలు పెరిగినప్పటికీ ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయని చెప్పారు. జడ్జిల నియామకంపై కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలన్నారు. ఖాళీలు భర్తీ అయితే న్యాయవ్యవస్థపై పెండింగ్ కేసుల భారం తగ్గుతుందన్నారు. దేశంలో ప్రభుత్వమే అతిపెద్ద కక్షిదారు అన్నారు. సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్లో సగం ప్రభుత్వాలకు సంబంధించినవేనని పేర్కొన్నారు.
పనికి మాలిన వ్యాజ్యాలు
ప్రజాప్రయోజన వ్యాజ్యాల(పిల్) దుర్వినియోగంపై జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది దీనిని ‘పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్’గా మార్చారని వ్యాఖ్యానించారు. రాజకీయ, కార్పొరేట్, వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి ‘పిల్’ను సాధనంగా వాడుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిమాలిన వ్యాజ్యాల వల్ల అవసరమైన కేసుల విచారణ ఆలస్యం అవుతున్నదని అసంతృప్తి ప్రకటించారు. కోర్టులో స్థానిక భాషలను ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని జస్టిస్ రమణ ఈ సందర్భంగా అన్నారు.
న్యాయ భాష అందరికీ అర్థమయ్యేలా ఉండాలి
న్యాయ వ్యవస్థ బలోపేతానికి అవసరమైన చర్యలు చేపడతామని ప్రధాని మోదీ అన్నారు. కోర్టుల్లో ఖాళీలను వేగంగా భర్తీ చేస్తామన్నారు. ‘ఈ అమృత కాలంలో న్యాయవ్యవస్థపై మనం దృష్టి పెట్టాలి. ప్రతీ ఒక్కరికి సులభంగా, త్వరితగతిన న్యాయం అందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. కోర్టుల్లో స్థానిక భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది’ అని పేర్కొన్నారు.