స్విట్జర్లాండ్కు చెందిన క్రిస్టినా వయసు 67 ఏండ్లు. టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. పెన్షన్ కూడా బాగా వస్తున్నది. హాయిగా కాలం వెళ్లదీయవచ్చు.కానీ ఆమె ఇంట్లో కూర్చోలేదు. 87 ఏండ్ల వృద్ధురాలి బాగోగులు చూడటానికి పనికి కుదిరారు. వారంలో రెండు సార్లు వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆమెకు సాయపడేవారు. ఇది చూసి ఆమె ఇంట్లో కిరాయికి ఉండే యువకుడు ఆశ్చర్యపోయాడు. డబ్బుకు ఇబ్బంది లేనప్పుడు పనికి ఎందుకు కుదిరారని క్రిస్టినాను అడిగాడు. దానికి ఆమె.. ‘నేను డబ్బు కోసం పనిచేయడం లేదు. సమయం కోసం పనిచేస్తున్నాను. నేను ఆ వృద్ధురాలి కోసం ఎన్ని గంటలు పనిచేస్తున్నానో ఆ సమయాన్ని నా టైమ్ బ్యాంక్లో దాచుకొంటున్నాను. నేను బాగా ముసలిదాన్ని అయ్యాక, కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు వాటిని వాడుకొంటాను’ అని సమాధానం ఇచ్చారు. ఇది విన్న ఆ యువకుడు మరింత ఆశ్చర్యపోయాడు. ఈ సంభాషణ జరిగిన కొద్ది కాలానికే క్రిస్టినా కిటికీ తుడుస్తూ స్టూలు మీద నుంచి కింద పడిపోయారు. కాలు విరిగింది. వెంటనే టైం బ్యాంకు నుంచి కొన్ని పని గంటలను విత్ డ్రా చేసుకొన్నారు. క్రిస్టినా బాగోగులు చూడటానికి టైమ్ బ్యాంక్ వలంటీర్లను పంపించింది.
కాలాన్ని బ్యాంకులో దాచుకో!
పిల్లలు లేని, పిల్లల ఆదరణకు నోచుకోనివారు వృద్ధాప్యంలో ఇబ్బందులు పడకుండా చూడాలనే ఆలోచనలో నుంచి ఉద్భవించిందే టైమ్ బ్యాంక్ కాన్సెప్ట్. స్విట్జర్లాండ్ సామాజిక భద్రత మంత్రిత్వశాఖ దీనిని పెన్షన్ పథకంలో భాగంగా తీసుకువచ్చింది. దీంట్లో ఎవరైనా రిజిస్టర్ కావచ్చు. ఉదాహరణకు ఇప్పుడు మీకు 30 ఏండ్లు అనుకోండి. ఇప్పుడే టైం బ్యాంక్లో రిజిస్టర్ అయి వీలు ఉన్నప్పుడల్లా వృద్ధులకు, అవసరమైనవారికి సేవ చేసి ఆ సమయాన్ని టైం బ్యాంక్లో దాచుకోవచ్చు. మీరు పనిచేసిన సమయం అంతా గంటల లెక్కన సోషల్ సెక్యూరిటీ సిస్టమ్లో మీ వ్యక్తిగత ఖాతాల్లో జమ అవుతుంది. మీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ పనిగంటలను విత్ డ్రా చేసుకోవచ్చు. అప్పుడు టైమ్ బ్యాంక్ మీకు సహాయంగా వలంటీర్లను పంపిస్తుంది.
30కి పైగా దేశాల్లో
టైమ్ బ్యాంక్ కాన్సెప్ట్ చైనా, రష్యా, యూకే, అమెరికా ఇలా 30కి పైగా దేశాల్లో ఉంది. అయితే, వాటిని ఆయా ప్రభుత్వాలు కాకుండా ఎన్జీవోలు, ట్రస్టులు, ఇతర సంస్థలు అమలు చేస్తున్నాయి. భౌగోళిక పరిమితులను అధిగమించి ఈ విధానం అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో టైమ్రిపబ్లిక్ అనే సంస్థ 2013లో గ్లోబల్ టైమ్ బ్యాంక్ను ప్రారంభించింది.
మానవ హక్కుల కమిషన్ సిఫారసు
టైమ్ బ్యాంక్ స్కీమ్ను పైలట్ ప్రాజెక్టుగా అయినా ప్రారంభించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) కేంద్రప్రభుత్వానికి గతంలో సిఫారసు చేసింది. బాగోగులు చూడటానికి ఎవరూ లేక దేశంలో 1.5 కోట్ల మంది వృద్ధులు ఉన్నారు. ఇండియాలో కూడా టైమ్ బ్యాంక్పై విస్తృత ప్రచారం జరుగుతున్నది. కొన్ని ట్రస్టులు వలంటీర్లను రిజిస్టర్ చేసుకొంటున్నాయి. 2019లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం టైమ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేసింది. దీనికి 50వేల మంది వలంటీర్లు కూడా దరఖాస్తు చేసుకొన్నారు.