బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప స్థానంలో బీజేపీ హైకమాండ్ మరో కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించబోతున్నదన్న ప్రచారం మరింత జోరందుకున్నది. ఈ నెల 26న యెడియూరప్ప తన పదవికి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు మీడియా ప్రతినిధులు ఈ విషయమై యెడియూరప్పను ప్రశ్నించారు.
అందుకు యెడియూరప్ప స్పందిస్తూ.. ఇప్పటివరకైతే ఎవరూ తనను రాజీనామా చేయమని అడగలేదని చెప్పారు. హైకమాండ్ నుంచి అలాంటి ఆదేశాలు ఏమైనా వస్తే.. పదవి నుంచి తప్పుకుని, పార్టీ కోసం పనిచేస్తానని ఆయన తెలిపారు. మీ వారసుడిగా మీరు ఎవరి పేరునైనా రికమెండ్ చేస్తారా..? అన్న ప్రశ్నకు తాను ఎవరి పేరునూ రికమెండ్ చేయబోనన్నారు. పార్టీ అధిష్ఠానమైతే ఇంతవరకు ఏమీ చెప్పలేని, జూలై 26 తర్వాత ఏం జరుగనుందో వేచి చూద్దామని యెడ్డీ వ్యాఖ్యానించారు.
ఇదిలావుంటే.. వీరశైవ, లింగాయత్లకు చెందిన వివిధ మఠాల అధిపతులు యెడ్డీకి మద్దతు పలుకుతున్నారని, అందుకే బీజేపీ హైకమాండ్ యెడ్డీని సీఎం పదవి నుంచి తప్పించాలని భావిస్తున్నా.. ఆ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నదని కర్ణాటకలో రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.